Tamil Nadu Rains: తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. నాగపట్నంలో 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. కరైకల్లో 12.2 సెం.మీ., పుదుచ్చేరిలో 9.6 సెం.మీ, కడలూరులో 9.3 సెం.మీ, ఎన్నూర్లో 9.2 సెం.మీలో చొప్పున వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు ఈ వర్షపాతం నమోదైంది.
అలాగే కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్పట్టు, కన్యాకుమారి సహా 18 జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. సోమవారం సైతం రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తమిళనాడు వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో ముందస్తు చర్యలు చేపట్టింది. చెంగల్ పట్టు, కన్యకూమారి, తిరవళ్ళూరు సహా ఆరు జిల్లాలో సోమవారం ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.