అన్నమయ్య జిల్లా (Annamayya District News) రామాపురం మండలం (Ramapuram Mandal) బండపల్లి టోల్ గేట్ (Bandapalli Toll Plaza) వద్ద దారుణం వెలుగు చూసింది. టోల్గేట్ సిబ్బందిపై వైసీపీ నేతలు పిడిగుద్దులు కురిపించారు. బండపల్లి టోల్ గేట్ వద్ద తమ వాహనానికి గేటును వెంటనే తీయలేదంటూ దాడికి పాల్పడ్డారు. వివరాలు.. లక్కిరెడ్డిపల్లె మండలం పాలెం గొల్లపల్లె ఎంపీటీసీ శ్రీలత భర్త శివశంకర్ నాయుడు తన అనుచరులతో కలిసి వాహనంలో మంగళవారం అర్ధరాత్రి టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు.
అప్పటికే గేట్ పడగా, బిల్ ఎంటర్ చేసి తెరిచే లోపు తన కారునే ఆపుతారా? అంటూ.. కౌంటర్లోని సిబ్బందిని బయటకు లాగి కొట్టారు. నానా దుర్భాషలాడారు. అడొచ్చిన వారినీ తీవ్రంగా గాయపరిచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీపుటేజ్లో నమోదయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ ఇదే తరహాలో శివశంకర్ నాయుడు దాడి చేశారని రామాపురం ఠాణాలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.