Gopireddy Srinivasa Reddy: నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Gopireddy Srinivasa Reddy) తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు. వరుసగా అసమ్మతి నేతలను కలుస్తున్నారు. కొద్ది రోజులుగా తనపై అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్న మార్కెట్ యార్డ్ చైర్మన్ హనీఫ్, జెడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి (Pilli Obul reddy) ఇళ్లకు వెళ్లి వారితో భేటీ అయ్యారు. వారి సమస్యలు, డిమాండ్లను విన్న ఆయన వాటిని నెరవేర్చుతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారట. ఇప్పటికే ప్రధాన అసమ్మతి నాయకుడు గజ్జల బ్రహ్మారెడ్డి (Gajjala Brahma Reddy) గృహానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి పెట్టిన రెండు షరతులను గోపిరెడ్డి అంగీకరించారు. ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ ఓరుగంటి శేషురెడ్డిని తొలగించి కామారెడ్డి శ్రీనివాసరెడ్డిని నియమించాలని, అలాగే రూరల్ సీఐ కృష్ణయ్యను బదిలీ చేయించాలని గజ్జల బ్రహ్మారెడ్డి కోరారట. కొద్ది రోజుల్లో ఎన్నికల బదిలీలు జరుగుతాయని, ఆ సమయంలో మార్పులు చేర్పులు చేయిస్తానని గోపిరెడ్డి ఆయనకు హామీ ఇచ్చారు. అన్నీ చేసినా సదరు నేతలు ఎమ్మెల్యే గోపిరెడ్డి నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనలేదట.